సమ పాలనకు, నిజాయితీకి అద్దం పట్టే విధంగా ఉన్న వైసీపీ మేనిఫెస్టో..
ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైసీపీ మేనిఫెస్టో విడుదల అయింది. తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్ ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాల విస్తరణతో పాటు కొత్తగా మరొక తొమ్మిది ముఖ్యమైన హామీలను కూడా ఇందులో పొందుపరిచారు. మేనిఫెస్టోలో ఉన్న ముఖ్య వివరాలు ఏమిటో చూద్దాం..
ప్రస్తుతం ఉన్న 3000 రూపాయల పెన్షన్ 500 పెంచి 3,500 గా అందిస్తారు. (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతారు). వైయస్సార్ చేయూత పథకం కింద నాలుగు విడతల్లో అందిస్తున్న 75 వేలను ఇప్పుడు లక్షన్నర రూపాయలకు పెంచడానికి ప్రతిపాదన చేశారు. అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న 15000 ని 2000 పెంచి 17000 గా చేశారు. మిగతా 2వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి ఖర్చు చేస్తారు. కాపు నేస్తం పథకం ద్వారా నాలుగు దపాలలో అందిస్తున్న 60 వేల రూపాయలను 1,20,000గా పెంచడానికి ప్రతిపాదించారు.
ఇలా సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక అంశంలో ముందుగా అందజేస్తున్న అమౌంట్ కంటే కూడా పెంచడం జరిగింది. అలాగే ప్రతి పేదవాడి జీవితంలో వెలుగు నింపే విధంగా మేనిఫెస్టోలో అనేక మార్పులను జగన్ చేశారు. విస్తృతంగా పథకాలను పేదలకు అందుబాటులో తీసుకువచ్చారు. అలాగే రాజధాని విషయంలో కూడా ఈ మేనిఫెస్టోలో కీలకంగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను రాజధానిగా చేస్తామని.. రాష్ట్రానికే విశాఖను గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇక అమరావతిని శాసన రాజధాని.. కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వివరించారు.
అంతేకాదు తాను చేసేదే చెబుతానని.. చెప్పేదే చేస్తానని జగన్ మరొకసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఎంతవరకు అయితే ప్రజలకు సేవ చేయడానికి కుదురుతుందో అంత మేరా తాను పథకాలను రూపొందించి మేనిఫెస్టోలో పొందుపరిచానని జగన్ స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలు నమ్మి ..చేయలేని వాటికి భ్రమపడి మాయలో పడద్దని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తాను ప్రజల ప్రగతి కోసం మేనిఫెస్టోని రూపొందిస్తే.. చంద్రబాబు ప్రజలను మాయ చేసి ఓట్లు లాక్కోవడానికి చేయలేనివి కూడా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2014లో చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఎన్నో హామీల గురించి పేర్కొన్నారని.. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని మరొకసారి గుర్తు చేశారు. కానీ తాను ఏదైతే చెప్పాను అది పూర్తి చేశానని.. ఇక నిర్ణయం ప్రజల చేతిలోనే ఉందని జగన్ పేర్కొన్నారు.