మాకు ప్రయోజనం చేకూరేలా భారత్ నిర్ణయం : అమెరికా
అమెరికా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్ తన మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని కీలక అధికారి తెలిపారు. కొన్ని డబ్ల్యూటీఓ వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని వెల్లడించారు. బైడెన్ వాణిజ్య విధాన రూపకల్పనపై ఏర్పాటైన హౌస్ కమిటీకి ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కేథరీన్ టాయ్ ఈ విషయాన్ని తెలిపారు. గత జూన్లో భారత్`అమెరికా ఆరు డబ్ల్యూటీఓ వివాదాలను పరిష్కరించుకున్నాయి. దీంతో అనేక యూఎస్ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి భారత్ అంగీకరించింది. ఫలితంగా మిషిగన్, ఒరెగాన్, వాషింగ్టన్తో సహా దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూరింది. శనగలు, కాయధాన్యాలు, బాదం, వాల్నట్లు, యాపిళ్లకు భారత్ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్లో మరికొన్ని వివాదాలు పరిష్కారమయ్యాయి. ఫలితంగా టర్కీకోళ్లు, బాతులు, బ్లూబెర్రీలు, క్రాన్బెర్రీలపై సుంకాలు మరింత తగ్గాయి. దీంతో ఆయా ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో యాక్సెస్ సులభతరమైంది అని చట్టసభ్యులకు కేథరీన్ వివరించారు.