షమీ సూపర్ షో.. కివీస్ను చిత్తుచేసి ఫైనల్లో అడుగు పెట్టిన భారత్
వాంఖడే వేదికగా జరిగిన ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో భారత్ జయభేరి మోగించింది. న్యూజిల్యాండ్పై 70 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రపంచ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు రోహిత్ శర్మ (47), శుభ్మన్ గిల్ (80 నాటౌట్) అదిరే ఆరంభం అందించారు.
వారితోపాటు విరాట్ కోహ్లీ (117) మరో శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీలు (49) రికార్డును బద్దలు కొట్టి తన కెరీర్లో 50వ వన్డే శతకం నమోదు చేశాడు. మధ్యలో గిల్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరడంతో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (105), చివర్లో కేఎల్ రాహుల్ (39 నాటౌట్) కూడా చెలరేగారు.
దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (13), రచిన్ రవీంద్ర (13) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే కేన్ విలియమ్సన్ (69), డారియల్ మిచెల్ (134) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ భారత విజయం చాలా దూరంగా ఉన్నట్లే కనిపించింది.
అయితే 32వ ఓవర్లో బంతి అందుకున్న షమీ.. విలియమ్సన్తోపాటు టామ్ లాథమ్ (0)ను అవుట్ చేసి జట్టుకు కావలసిన బ్రేక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కివీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు డారియల్ మిచెల్ కూడా పెవిలియన్ చేరడంతో ఆ టీం విజయావకాశాలు పూర్తిగా మాయమయ్యాయి. ఈ క్రమంలోనే ఆ జట్టు 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ ఏకంగా ఏడు వికెట్లతో రెచ్చిపోయాడు. అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.