కరోనా సెకండ్ వేవ్... రియల్ ఎస్టేట్ కు కష్టాలు తప్పదా?
తెలంగాణలోనూ, ముఖ్యంగా హైదరాబాద్లో గత సంవత్సరం కోవిడ్ దెబ్బ నుంచి తేరుకుని మళ్ళీ లాభాలబాట పట్టిన రియల్ ఎస్టేట్రంగానికి కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ నష్టాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో కరోనా సెకండ్వేవ్ అనుకున్నదానికంటే బాగా పెరిగిపోవడంతో చాలాచోట్ల రాష్ట్రాలు కర్ఫ్యూ బాటన పడుతున్నాయి. దానికితోడు లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్ళడం ప్రారంభించారు. పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రారంభం కాకముందే సొంతూళ్లు బాట పడితే మంచిదని వారంతా అనుకున్నట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్లో పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్డౌన్లు ప్రకటిస్తున్న విషయాన్ని టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న పలువురు వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. తమ ఊళ్లకు వెళ్లే రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు, టికెట్ల లభ్యతపై విచారిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే సొంత ప్రదేశాలకు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలోని ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు పని కోసం వచ్చిన వారైతే ఇమ్లిబన్, జేబీఎస్ బస్స్టేషన్ల వద్దకు బస్సు కోసం పరుగులు తీస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నవారిలో చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే ఉంటారని అంచనా. వీరిలో కొందరు స్కిల్ వర్కర్లు కాగా మరి కొందరు సెమీ స్కిల్డ్ వర్కర్లు. గతేడాది కరోనా సంక్షోభం ముందు వరకు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కలిపి సమారు 5 లక్షల మంది దాకా వలస కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేసేవారు. అయితే కరోనా మొదటి వేవ్ దెబ్బకు బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిన లక్షలాది మంది కార్మికుల్లో ఇంకా తిరిగిరాని వారున్నారని పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీల యజమానులు చెబుతున్నారు. గతేడాది లాక్డౌన్ ఎత్తివేయగానే తిరిగి వచ్చిన వలస కార్మికుల్లో మళ్లి లాక్డౌన్ విధిస్తారేమోనన్న భయం వెంటాడుతోందని వారు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో కనీసం 3 నుంచి 4 లక్షల మంది దాకా వలస కార్మికులు నిత్యం పనిచేస్తుంటేనే పరిశ్రమ సజావుగా ముందుకు వెళుతుందని కంపెనీల యజమానులు చెబుతున్నారు. లేదంటే ఇటు రెసిడెన్షియల్, అటు కమర్షియల్ ప్రాజెక్టులు సమయానికి పూర్తవక ఖర్చు, అప్పులకు వడ్డీలు తడిసి మోపెడవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ సప్లై చైన్ ప్రభావంతో స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర అన్నింటి ధరలు గతంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం పెరిగాయి. దీంతో బిల్డర్లకు నిర్మాణ ఖర్చు పెరిగిపోయింది. ఈ ఖర్చును భరిస్తూ వినియోగదారులకు సరైన సమయంలో ఇళ్లు, ఫ్లాట్లు అందించడానికి బిల్డర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇంతలో సెకండ్ వేవ్లో భాగంగా కరోనా మహమ్మారి మళ్లి విజృంభిస్తుండడంతో వలస కార్మికులు వెళ్ళిపోతే లేబర్ ఖర్చు తడిసి మోపెడై భవన నిర్మాణం మరింత భారమయ్యే ప్రమాదం లేకపోలేదని వారు వాపోతున్నారు. దీనివల్ల కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పడిపోవడం ఖాయమని మరికొందరు చెబుతున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్రంగంలో పెద్ద కంపెనీలుగా పేరు పొందిన కంపెనీలు లాక్డౌన్ వల్ల లేబర్ కష్టాలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. ఒక వేళ పూర్తిస్థాయి లాక్డౌన్ పరిస్థితి వచ్చినప్పటికీ వలస కార్మికులను తమ వద్దే ఉంచుకునే ఏర్పాట్లను అవీ చేసుకున్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు, ముఖ్యంగా వలస కార్మికులకు కొవిడ్ టీకాను కూడా ఇప్పించే బాధ్యత తమదేనని కొద్ది రోజుల క్రితం క్రెడాయ్ ప్రకటించింది. ఈ తరహా చర్యలతో ఈసారి లాక్డౌన్ విధించినప్పటికీ గతంలోలా కాకుండా కొంతవరకు వలస కార్మికులు ఇక్కడే ఉండే అవకాశాలు లేకపోలేదని కొందరు బిల్డర్లు చెబుతున్నారు.