అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తిగా....గోపీచంద్ రికార్డు!
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. బ్లూ ఆరిజిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన న్యూ షెపర్డ్ ప్రాజెక్టులో టూరిస్ట్గా వెళ్లనున్నారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష్ బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. భారత తొలి స్పేస్ టూరిస్ట్గా తాజాగా గోపీచంద్ చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటునప్పటికీ భారత పాస్పోర్టు ఉండడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో పుట్టిన గోపిచంద్ తోటకూర ప్రిజర్వ్ లైఫ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. అట్లాంటా శివారులో మిలియన్ల డాలర్లతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఒక వెల్నెస్ సెంటర్. గోపీచంద్ పైలట్గానూ శిక్షణ పొందారు. పదేళ్ల క్రితం భారత్లో మెడికల్ ఎయిర్-ఎవాక్యుయేషన్ సేవల్లో పనిచేశారు. బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు తన కుటుంబానికి సైతం ఈ విషయం తెలియదని గోపీచంద్ వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయసులోనే అంతరిక్షంపై ఆసక్తి కలిగిందని తెలిపారు. ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో బీఎస్పీ పూర్తి చేశారు.