లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి ... రికార్డు స్థాయిలో
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటారన్న విషయం తెలిసిందే. తమ గెలుపుకోసం ఓటర్లకు డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారు, వెండి, ఖరీదైన వస్తువులను ఇస్తుంటారు. ఈయితే ఈ సారి మాత్రం రికార్డు స్థాయిలో రికవరీ జరిగింది. గత 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మొత్తం 2024 ఎన్నికల సమయంలో పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు తొలి విడతలో డబ్బు, మద్యం, బంగారం, ఇతర వస్తువుల రూపంలో మొత్తం రూ.4,650 కోట్లు రికవరీ అయ్యింది. సగటున రోజుకు రూ.100 కోట్ల మేర రికవరీ జరిగినట్లు. ఇందులో నగదు రూ.395.39 కోట్లు కాగా, బంగారం, వెండి వంటి విలువైన లోహాల రూపంలో రూ.562.10 కోట్లు రికవరీ చేసినట్లు ఈసీ తెలిపింది. అలాగే రూ.489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం పట్టుపడినట్లు పేర్కొంది. ఈ ఏడాది మొత్తం రికవరీలో సింహభాగం మాదకద్రవ్యాలదే కావడం గమనార్హం. రూ.4,650 కోట్ల రికవరీలో 45 శాతం మేర మాదక ద్రవ్యాలే ఉన్నట్లు ఈసీ తెలిపింది.