రూ.1,460 కోట్ల బాండ్ సమర్పించిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆస్తుల విలువను ఎక్కువగా చూపి బ్యాంకుల నుంచి వందల కోట్ల డాలర్ల రుణాలను అక్రమంగా పొందారనే కేసు కీలక మలుపు తిరిగింది. ఈ సివిల్ మోసం కేసులో ట్రంప్ 45.4 కోట్ల డాలర్ల బాండును సమర్పించాలని అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ కేసు పెట్టారు. లేదంటే ఆయన ఆస్తులను ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి బాండ్ మొత్తాన్ని తగ్గించాలని న్యూయార్క్ అప్పిలేట్ కోర్టును ట్రంప్ అభ్యర్థించగా, కోర్టు దాన్ని 17.5 కోట్ల డాలర్లకు తగ్గించింది. 10 రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తుల జప్తు తప్పదని హెచ్చరించింది. దాంతో ట్రంప్ నాడు ఆ బాండ్ సమర్పించారు. ఒకవేళ కేసులో ట్రంప్ ఓడిపోతే మొత్తం 45.4 కోట్ల డాలర్లను రోజువారీ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ట్రంపే నెగ్గితే ఆయన ఎలాంటి మొత్తాన్నీ చెల్లించనక్కర్లేదు. ఇప్పుడు కట్టిన మొత్తం తిరిగి వచ్చేస్తుంది.