బీఆర్ఎస్ కు కాంగ్రెస్ వార్నింగిస్తోందా...?
సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమై నెలరోజులు గడిచింది. కాంగ్రెస్ అవినీతిని టార్గెట్ చేస్తూ, సంక్షేమపాలన కొనసాగిస్తామంటూ ముందుకెళ్తున్నారు రేవంత్. అయితే ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నేతలు.. తమతో పలువురు కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని.. తాము గేట్లు తెరిస్తే, పార్టీలో పలువురు కాంగ్రెస్ నేతలు చేరుతారని ప్రకటనలు చేస్తున్నారు. ఈపరిణామాల వెనక అంతరార్థం ఏమైనా.. ఇది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అంతే ధీటుగా స్పందించారు. తెలంగాణలో తమకు పూర్తి మెజారిటీ ఉందని... ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశ్యం తనకు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పుడు మార్గాలను ఎంచుకోవాలని తాను చూడటం లేదన్నారు. కానీ ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే మాత్రం అందుకు తిగిన విధంగా తమ గేమ్ మారుతుందని తేల్చి చెప్పారు.
అయినా అలాంటి చర్య తెలంగాణలో జరగదని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పుకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కేసీఆర్ కొడుకు.. ఇతరులు ఫిరాయింపుల అంశంపై దూకుడుగా వెళ్తే... రంగస్థలం తయారు చేస్తే అందుకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామన్నారు. కేసీఆర్కు.. ఆయన కుటుంబానికి ఇష్టం ఉన్నా లేకపోయినా తాను ముఖ్యమంత్రినై ముప్పై రోజులు అయిందన్నారు. తాను ఇప్పటి వరకు బ్యాలెన్స్గానే ఉన్నానని... ఇక ముందు కూడా అలాగే వ్యవహరిస్తానన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ .. ఇప్పుడు అంగ, అర్థబలం, పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. పోలీసులు, నిఘా వర్గాలు సైతం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయి.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మంత్రుల ప్రకటనలు ఆపార్టీకే చేటు తెచ్చే ప్రమాదముందంటున్నారు నిపుణులు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో గులాబీ నేతలు, శ్రేణులు నిస్తేజంగా మారాయి. ఈ సమయంలో కాంగ్రెస్ కనుక ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభిస్తే.. ఉండే వారెందరూ, పోయేవారందరు అన్నట్లుగా లెక్కలు మారే ప్రమాదముంది. అందుకే గులాబీదళం కాస్త సంయమనంగా వ్యవహరిస్తే హుందాగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.