కారు గేర్ మార్చాలి....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిస్తేజంగా మారింది. ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి... బీఆర్ఎస్ పాలనలో అవినీతిని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా న్యాయవిచారణకు ఆదేశించారు. అవినీతిని వెలికి తీస్తామని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు. దీనికి తోడు మాట్లాడితే, అవినీతి పాలన అంటూ ఎత్తిపొడుపులు సాదారణమయ్యాయి. మరోవైపు.. ఇటీవలే జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఓటమితో .. పార్టీలో మరింతగా నైరాశ్యం తాండవిస్తోంది.
ఈలోపు సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలు...పార్టీ పటిష్టంపై దృష్టి సారించారు. తెలంగాణలో 1.82 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెడితే బాగుండేదని అనే అభిప్రాయానికి వచ్చామని, చిన్న చిన్న లోపాలతోనే ఓడిపోయామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని, బిఆర్ఎస్పై జరిగిన అసత్య ప్రచారాన్ని ఖండించలేకపోయామన్నారు. అమలు చేసిన పథకాలను సమర్థవంతంగా ప్రచారం చేసుకోలేకపోయామని కెటిఆర్ బాధను వ్యక్తం చేశారు. కెసిఆర్ సిఎంగా లేరు అన్న విషయాన్ని చాలా మంది వ్యవక్తపరుస్తున్నారని, అభ్యర్థుల మీద వ్యతిరేకతతో ఓటేశామని చాలా మంది అంటున్నారని కెటిఆర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఏ కారణం చేత ఓటు వేయాలి ? అనే ప్రశ్న వస్తుందని.. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలంటే.. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు. తెలంగాణ అన్న మాట ధైర్యంగా అనాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక అవసరమైతే నిలబడాలి.. కలబడాలంటే కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది బీఆర్ఎస్కే మాత్రమేన్నారు.
ఢిల్లీలో వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసన్న కేటీఆర్..... కాంగ్రెస్, బీజేపీ కానీ అన్ని రాష్ట్రాల్లో ఇదో రాష్ట్రంగా చూస్తాయి. కానీ, మాకు సెంటర్. మేం కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు ప్రధాన కేంద్రం హైదరాబాద్, తెలంగాణ. మా ప్రధాన ఎజెండానే తెలంగాణ కాబట్టి.. తెలంగాణ కోసం.. సమస్యలు, హక్కులు, వాటాల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది.. బలంగా కృషి చేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమే. అందుకే అంటున్న తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్. అందుకే పార్లమెంట్లో ప్రశ్నించాలన్నా.. ఏ అంశంపై లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది.. పోరాడగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.