అమెరికాలో స్థిరపడేందుకు సునయనకు సాయం
జాత్యహంకారి కాల్పుల్లో చనిపోయిన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన అమెరికాకు తిరిగొచ్చి స్థిరపడేందుకు తోడ్పడతామని కాన్సస్ గవర్నర్ శామ్ బ్రౌన్బ్యాక్ ప్రకటించారు. కూచిభొట్ల గౌరవార్థం మార్చి 16వ తేదీని ఇండియన్- అమెరికన్ ప్రశంసాదినం గా గుర్తించే అధికారిక ప్రకటనపై సంతకం చేవారు. టొపెకాలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సునయన అమెరికాలో నివసించేందుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ఆమెకు అన్ని విధాలుగా సాయపడతామని చెప్పారు. కాన్సస్కు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోదలచిన భారతీయులందరినీ స్వాగతిస్తామన్నారు. భారతీయుల సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అలోక్ మాడసాని, ఇయాన్ గ్రిల్లట్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాల్పులు ఘటనపై గవర్నర్ క్షమాపణలు చెప్పారు. కాగా, సిక్కులపై విద్వేష దాడుల నేపథ్యంలో డెలవార్ రాష్ట్రం ఏప్రిల్ నెలను సిక్కు చైతన్యం ప్రశంసామాసంగా పాటించాలని నిర్ణయించింది.