ASBL NSL Infratech

నంద్యాల గెలుపెవరిది…..?

నంద్యాల గెలుపెవరిది…..?

వైసీపీ-టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎస్పీజి గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో వైసీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. గతంలో మరే ఉప ఎన్నికకు లేనంత ఉత్కంఠ నంద్యాలలో నెలకొంది. అన్న మోహనరెడ్డికి బాసటగా తమ్ముడు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోవడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. వైసీపీ అభ్యర్ధిగా శిల్పాను ప్రకటించినప్పటి నుంచి చక్రపాణి రెడ్డి టీడీపీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతుగా తెలుగు దేశం ఏకంగా పోలింగ్‌ బూత్‌కో ఎమ్మెల్యేను బాధ్యుడిగా నియమించింది. నంద్యాల ఎన్నికల కోసం అస్త్రాలన్నింటిని ఎక్కుపెట్టింది. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు అంతు లేకుండా పోతోంది. వైసీపీ కూడా తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయించుకుంది. నంద్యాల గెలుపు పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేస్తుందని భావిస్తున్నారు. తమ పార్టీలో గెలిచి ఫిరాయించిన 21మందిపై ఒత్తిడి పెంచాలంటే నంద్యాల గెలుపును ఖాయం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు నంద్యాల గెలుపొటములపై ముందస్తు అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యోతిష్యాల మీద నమ్మకం ఉన్న వారైతే 57ఏళ్ల శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఢోకా ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. మరో పదేళ్ల పాటు రాజకీయంగా శిల్పా భవిష్యత్తు ఉచ్ఛ స్థితిలో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుత ఉప ఎన్నికతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయనకు ఎదురు ఉండదని గట్టిగా చెబుతున్నారు.

 

Tags :