ASBL NSL Infratech

టాటా మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించిన ఎర్రబెల్లి

టాటా మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించిన ఎర్రబెల్లి

సేవా గుణంతో పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు చెర్లపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్‌ అనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ఝాన్సీరెడ్డి దంపతులు తొర్రూరులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించి ఇవ్వడంతో నేడు వందలాది మంది నిరుపేద రోగులకు ప్రయోజనకరంగా మారిందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి నేతృత్వంలో తొర్రూరు సీహెచ్‌సీలో నిర్వహించిన మెగా హెల్త్‌ క్యాంప్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలాంటి వైద్య శిబిరాల్లో వివిధ రకాల స్పెషాలిటీలకు చెందిన వైద్యులు రోగులకు పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేపడితే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి గానీ ప్రభుత్వం ఎల్‌వోసీ ద్వారా అవసరమైన వారందరికీ శస్త్రచికిత్సలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్వహించిన మెగా హెల్త్‌ క్యాంప్‌లో 40 వేల మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేయించగా 300 మందికి ఏడాది కాలంలో గుండె శస్త్రచికిత్సలు చేయించినట్లు చెప్పారు. నిస్వార్థంగా అనుమాండ్ల రాజేందర్‌రెడ్డి దంపతులు గ్రామాన్ని దత్తత తీసుకుని సేవ చేస్తున్నారని వారు తీరు అభినందనీయమన్నారు. ఈ దంపతులు చేసే సేవా కార్యక్రమాలకు తనతో పాటు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

500 మందికి వైద్య పరీక్షలు

టాటా ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ ఎం శ్రీనివాసరావు, స్వాతి దంపతులు, అక్కడి దవాఖానకు సంబంధించిన పలువురు వైద్యులు ఉచిత గుండె పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి ఏ విజయ్‌కుమార్‌తో పాటు స్థానిక వైద్యులు శ్రీకళ, మిరాజ్‌, దంతాలపల్లి, మరిపెడ, నెల్లికుదురు వైద్యులు అక్షయ్‌, రవి, జ్యోతి, డాక్టర్‌ ఏ శ్రీనివాస్‌, రాజేశ్‌, తొర్రూరుకు చెందిన ప్రైవేట్‌ వైద్యులు సీహెచ్‌ స్వరూప్‌కుమార్‌, జి.రాజు, నరేశ్‌, సాయిభార్గవ్‌, భరత్‌, కిరణ్‌తో పాటు పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

టాటా నుండి, ఆసుపత్రి ద్వారా, తొర్రూరు ఫార్మసిస్ట్‌ షాపుల అసోసియేషన్‌ ద్వారా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు, ఝాన్సీరెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీఎస్పీ జి.రాజారత్నం, ఎంపీపీ కర్నె సోమయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అనుమాండ్ల నరేందర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నకిరకంటి కొమురయ్య, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ ధరావత్‌ రాజేశ్‌ నాయక్‌, లయన్స్‌ పూర్వ గవర్నర్‌ డాక్టర్‌ కె.రాజేందర్‌రెడ్డి, స్వాతి, డాక్టర్‌ సట్ల వెంకట్‌, అనుమాండ్ల తిరుపతి రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల బాధ్యులు సీతారాములు, శ్రీనివాస్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, నాలుగు పీహెచ్‌సీల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

Tags :