ASBL NSL Infratech

కృష్ణాజిల్లాలో 70 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు - జయరామ్‌ కోమటి

కృష్ణాజిల్లాలో 70 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు - జయరామ్‌ కోమటి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఇప్పటికే 70 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసినట్లు అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి తెలిపారు. మరిన్నిచోట్ల ఈ డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ మాట్లాడుతూ, దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థుల విద్యలో ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు కాకాని మురళికృష్ణ,  వెలిగేటి కరుణ్‌, శ్రీలక్ష్మి దంపతుల సౌజన్యంతో స్థానిక కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతి గదులను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె సంధ్యరాణి, పాఠశాలలోని డిజిటల్‌ తరగతులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీరాం రాజగోపాల్‌ మాట్లాడుతూ గతంలో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఎంతో పెరిగాయన్నారు. దానికితోడు దాతలు కూడా తమ సహాయ సహాకారాలను అందిస్తున్నారన్నారు. గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు కాకాని మురళికృష్ణ, వెలిగేటి కరుణ్‌ శ్రీలక్ష్మి దంపతులను శ్రీరాం రాజగోపాల్‌, కమిషనర్‌ సంధ్యారాణిలు, గ్రామస్థులు సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రతి పాఠశాలలో నాణ్యమైన బోధన కొరకు ఎన్‌ఆర్‌ఐల సహకారంతో డిజిటల్‌ తరగతులనే ఏర్పాటు చేస్తున్నట్లు సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, జడ్‌పీటీసీ సభ్యురాలు గింజుపల్లి శ్రీదేవి, ఎంపీపీ వెల్ది జ్యోతి,, డీసీ చైర్మన్‌ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, ఉపసర్పంచ్‌ చింతల వెంకట సీతారామయ్య, గ్రామీణాభివృద్ధి సహాయ సంచాలకుడు హరిప్రసాద్‌, హెచ్‌ఎం ఆళ్ల రాంబాబు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ బాడిశ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :