ASBL NSL Infratech

విశాఖలో రైలు పెట్టెల కర్మాగారం

విశాఖలో రైలు పెట్టెల కర్మాగారం

హైస్పీడు రైలు ఇంజిన్లు, బోగీల తయారీ కర్మాగారం విశాపట్నం తలుపుతట్టనుంది. ఈ రంగంలో 75 ఏళ్ల అపార అనుభవం ఉన్న ప్రసిద్ధ సంస్థ స్టాడ్లర్‌ రైల్‌ మేనేజ్‌మెంట్‌ ఏజీ సంస్థ ఈ యూనిట్‌ను నెలకొల్పడానికి సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలకు స్విట్జర్లాండ్‌కు చెందిన బీకేడబ్ల్యూ ఎనర్జీ ఏజీ సంస్థ సహకారాన్ని అందించనుంది. దావోస్‌ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు మార్గమధ్యలో జూరిచ్‌లో దిగారు. ఈ సందర్భంగా అక్కడ పలువురు  పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు, వనరులను వివరిస్తూ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలని కోరారు. జూరిచ్‌ లో స్టాడ్లర్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీటర్‌ జెనెల్టన్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఒక తయారీ యూనిట్‌ను నెలకొల్ఫాలని, పూర్తి సహకారం అందిస్తామని ఆహ్వానించారు. దానికి ఆ సంస్థ ప్రతినిధులు సానూకూలంగా స్పందిస్తూ దీనిపైన తాము అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. స్టాడ్లర్‌ రైల్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బృందంతో కలిసి సందర్శించారు. హైస్పీడ్‌ రైల్‌ బోగీల తయారీని పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు జి.సాయిప్రసాద్‌, జాసిక్త కృష్ణకిశోర్‌, అజయ్‌జైన్‌ తదితరులున్నారు.

Tags :