ASBL NSL Infratech

ఆటా కాన్ఫరెన్స్ కు ప్రముఖులను ఆహ్వానించిన ఆటా నాయకులు

ఆటా కాన్ఫరెన్స్ కు ప్రముఖులను ఆహ్వానించిన ఆటా నాయకులు

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) 17వ మహా సభలు, యూత్‌ కన్వెన్షన్‌ను పురస్కరించుకుని ఈ వేడుకలు రావాల్సిందిగా తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖులను ఆటా నాయకులు కలుసుకుని ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్‌ కమిటీ ఛైర్మన్‌ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ చల్లా ముఖ్యమంత్రిని కలిసి కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆటా అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు.

అలాగే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డిని కూడా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల ఇతర కార్యవర్గ సభ్యులు కలిశారు. జులై 1వ తేదీ నుండి వాషింగ్టన్‌ డి.సిలో జరుగుతున్న ఆటా మహాసభలకు హాజరు కావలసిందిగా ఆహ్వానం అందించారు. దీనికి మంత్రి కిషన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు.  తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుని ఆ సంఘం ప్రతినిధులు జయంత్‌ చల్లా, శరత్‌ వేముల, రఘువీర్‌ రెడ్డి, భువనేశ్‌ బుజాల, సన్నీ రెడ్డి తదితరులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆటా ప్రతినిధులు మంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1990లో ఏర్పడిన ఈ సంఘం అమెరికాలో తెలుగు కళలు, సంప్రదాయాలు, సంస్కృతీ పరిరక్షణకు పాటుడపడుతున్నదన్నారు. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ మహా సభలలో వివిధ రంగాలకు చెందిన తెలుగు వాళ్ళని పిలిచి వివిధ అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, ఆటా సభలకు తాను గతంలోనూ వెళ్ళానన్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగగా గొప్పగా నిర్వహించుకునే ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని  అంటూ, ఆటా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ, తాను తప్పక వస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఆటా నాయకులు కలిసి ఆటా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, టీటీడి చైర్మన్‌ ఎస్‌.వి. సుబ్బారెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, రోజా, మిధున్‌ రెడ్డి తదితరులను కూడా ఆటా నాయకులు ఆహ్వానించారు.

 

 

Tags :