ASBL NSL Infratech

ఆటా కాన్ఫరెన్స్ పనులు ముమ్మరం...

ఆటా కాన్ఫరెన్స్ పనులు ముమ్మరం...

అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాషింగ్టన్‌ డీసిలో నిర్వహించనున్న ఆటా మహాసభలకు ఏర్పాట్లు  ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి  ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారుతోపాటు ఇతర ముఖ్య నాయకులు  అవసరమైన అన్నీ ఏర్పాట్లను చేస్తున్నారు. వాషింగ్టన్‌ డీసిలోనే పెద్దదైన వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే ఈ మహాసభలను అహో అనిపించేలా నిర్వహించేందుకు భువనేష్‌ బూజాలతోపాటు, ఆటా మహాసభలకోసం ఏర్పాటైన కమిటీలు కృషి చేస్తున్నాయి. ఈ కన్వెన్షన్‌ కోసం 65 కమిటీలను ఏర్పాటు చేశారు. 350 మంది కమిటీల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరంతా ఆటా కన్వెన్షన్‌ విజయవంతం కోసం అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని పనిచేస్తున్నారు.

కాన్ఫరెన్స్‌ అడ్‌హాక్‌ కమిటీ, కోర్‌ కమిటీ, కాన్ఫరెన్స్‌ అడ్వయిజరీ కమిటీ, కో`హోస్ట్‌ కమిటీలు ఓవరాల్‌గా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వివిధ కార్యక్రమాలకోసం మరికొన్ని కమిటీలను కూడా ఆటా ఏర్పాటు  చేసింది.  ఈ కమిటీల్లో కూడా తాము ఒక్కొక్క అంశానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కల్చరల్‌ కోసం సాధారణంగా ఓ కమిటీనే ఉంటుంది. కాని తాము ఈ కల్చరల్‌ కార్యక్రమాన్ని 4 అంశాలుగా విభజించామని, కల్చరల్‌-బాంక్వెట్‌, కల్చరల్‌ - ఇనాగురల్‌, డే, కల్చరల్‌ - డే కార్యక్రమాల పేరుతో ప్రత్యేకంగా విభజించి అందుకుతగ్గట్టుగా కమిటీ సభ్యులను నియమించామని కాన్ఫరెన్స్‌ నాయకులు తెలిపారు. హాస్పిటాలిటీ కమిటీని కూడా విభజించి హాస్పిటాలిటీ సూట్స్‌ అండ్‌ అదర్స్‌, హాస్పిటాలిటీ మెయిన్‌, హాస్పిటాలిటీ - వెల్‌కమ్‌ ప్యాకేజీ, హాస్పిటాలిటీ - పొలిటీషియన్స్‌, హాస్పిటాలిటీ సినీ ఆర్టిస్ట్స్‌ పేరుతో విభజించి వాటికి కూడా ప్రత్యేకంగా సభ్యులను నియమించాము. పొలిటికల్‌ కమిటీని కూడా ఆంధ్రకు ప్రత్యేకంగా, తెలంగాణకు ప్రత్యేకంగా, అమెరికాకు ప్రత్యేకంగా కమిటీలు ఉండేటట్లుగా విభజించి సభ్యులను నియమించాము. ఫుడ్‌కమిటీని కూడా విభజించాము. ఫుడ్‌ - డోనర్స్‌, ఫుడ్‌ - నాన్‌ డోనర్స్‌, ఫుడ్‌ - బాంక్వెట్‌ ఇలా విభజించాము. ముఖ్యమైన కమిటీలను ఇలా విభజించడం వల్ల ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే చేశాము. ఇలా ఇంతమందితో కమిటీలను ఏర్పాటు చేసి ఈ మహాసభలను పెద్దఎత్తున నిర్వహించడంతోపాటు ఇంతకుముందు ఇలాంటి మహాసభలు జరగలేనట్లుగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని భువనేష్‌ బూజాల తెలిపారు. 

మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్‌తో జూలై 3న  గ్రాండ్‌ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్‌ హాజరు కావడం విశేషం. విజయ్‌ దేవరకొండ, డిజె టిల్లు ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ,  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రామ్‌ మిర్యాల, మంగ్లీ, కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, క్రిస్‌ గేల్‌ మరియు రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్‌ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల కోరారు.

కాన్ఫరెన్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి.

https://www.ataconference.org

 

Tags :