హరీశ్ రావు బీఆర్ఎస్ పాలిట ఏక్నాథ్ షిండే కావడం ఖాయం : మంత్రి సీతక్క
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రిసిగ్నేషన్ రాజకీయాలకి బాగా పాపులర్ అయిపోయాడు. మాట్లాడితే దిగిపోతా.. రాజీనామా.. ఈ మాటలు తప్ప మరెటువంటి ఉపయోగకరమైన మాటలు మాట్లాడడం అతను మానేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ పార్టీకి మరో ఏక్ నాథ్ షిండే కావడం ఖాయమని సీతక్క విమర్శించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. హరీష్ రావు కి పదవిపై ఎంత కాంక్ష ఉందో అందరికీ తెలుసని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ప్రజాధనాన్ని నీళ్లలో పోసింది సరిపోలేదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే గ్యారెంటీకి మారుపేరని.. రుణమాఫీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆమె పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉందని..బీజేపీ నేతలు కేవలం ఓట్ల కోసం మాత్రమే దేవుళ్లను రాజకీయ అంశంగా మారుస్తున్నారని మండిపడ్డారు. దేవుని అడ్డం పెట్టుకొని ఒక నాలుగు ఓట్లు గుంజుకోవాలని చూస్తున్నారే తప్ప ప్రజల కోసం, వారి మనోభావాల కోసం వారు ఏమి చేయడం లేదని సీతక్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలో మాత్రమే బయటికి వస్తారని.. మిగిలిన సమయంలో ప్రజల కష్టాలు పట్టించుకునే తీరుబడి ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని కాదు అనుకుని కాంగ్రెస్ ను నమ్ముతున్నారని సీతక్క పేర్కొన్నారు.