దేశంలో అతి పెద్ద సమస్య కాంగ్రెస్సే: సీఎం యోగి
దేశంలో అతి పెద్ద సమస్య కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ ఫైర్బ్రాండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలు ఆకలితో అలమటిస్తుంటే ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారీ మెతక వైఖరి అనుసరించిందని, అందువల్లే దేశానికి ఈ దుర్దశ పట్టిందని విమర్శించారు. రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్.. బీజేపీ సర్కార్ పాలనను కొనియాడుతూనే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
‘‘ఈ దేశంలో అతి పెద్ద సమస్య హస్తం పార్టీ. కాంగ్రెస్ పాలనలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే విధానాలూ లేవు. కీలక నిర్ణయాలు లేవు. అదే బీజేపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు కొదవలేదు. మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత దేశ ప్రతిష్ఠ పెరిగింది. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయి. జమ్మూకశ్మీర్పై కాంగ్రెస్ రుద్దిన ఆర్టికల్ 370ని శాశ్వతంగా రద్దు చేశాం. అందుకే మరోసారి బీజేపీని గెలిపించుకుందాం.’’ అంటూ సీఎం యోగి పేర్కొన్నారు.
అలాగే కరోనా సమయంలో కాంగ్రెస్తో సహా పలు పార్టీలు కనిపించకుండా పోతే.. మోదీ మాత్రం తన గురించి పట్టించుకోకుండా అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. బీజేపీ పాలనలో సంక్షేమ పథకాలకు కొదవలేదని, గత 4 ఏళ్లుగా 80 కోట్ల మంది పౌరులకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోందని అన్నారు. ఇక అయోధ్య రామమందిర నిర్మాణం మోదీ సర్కార్ సాధించిన గొప్ప విజయంగా సీఎం యోగి పేర్కొన్నారు.