మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పేద ప్రజలందరికీ : చంద్రబాబు
కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న టీ కొట్టులోనూ ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే, మద్యం దుకాణాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. మద్యం నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న సీఎం జగన్ ఆడిన మాటా నిలబెటుకున్నారా? అని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తా అన్నారు చేశారా?. జాబ్ క్యాలెండర్ అన్నారు.
మెగా డీఎస్సీ వేస్తా అన్నారు వేశారా?. మా హయంలో కరెంట్ ఛార్జీలు పెరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డీఎస్సీ పైనే. అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేశాం. మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతును రాజుగా చేసే బాధ్యత నాది. మేం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ వచ్చి రూ.4 వేలు పింఛను ఇస్తాం. మా హయంలో అద్భుతమైన టిడ్కో ఇళ్లు కట్టాం. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తాం. మూలపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఎవరివల్ల బాగుంటామో ప్రజలంతా లెక్కలు వేసుకొని ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు.