అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు
వివాదాస్పద తూర్పు చైనా సముద్ర జలాల్లో అమెరికా, జపాన్, దక్షిణకొరియాలు ఈ నెల 10 నుంచి 12 వరకు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. జపాన్ ప్రధాని పుమియొ కిషిద, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్లతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస్లో సమావేశమైన సమయంలోనే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. ఈ జలాల్లో చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని ప్రకటించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
ఈ విన్యాసాల్లో అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్తో పాటు ఆ దేశానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌకలు, జపాన్, దక్షిణ కొరియా యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. జలాంతర్గాములపై దాడి చేసే ఆయుధ వ్యవస్థల ప్రదర్శన, సముద్ర మార్గంలో ఆయుధాల రవాణాను అడ్డుకొనే ప్రక్రియను సాధన చేశాయి. ఈ పరిణామాలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జపాన్ ప్రతికూల చర్యలు తమను అసహనానికి గురి చేస్తున్నాయని పేర్కొంది.