ఏపీలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి.. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్..
త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రాలో నామినేషన్ల హడావిడి చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంగా పలువురు అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు లెక్కలు బయటకి వస్తున్నాయి. చాలామందికి సంబంధించిన ఆస్తి వివరాలు ప్రజలను ఆశ్చర్య పరుస్తున్నాయి. టీడీపీ తరఫున గుంటూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. నామినేషన్ సందర్భంగా బయటకి వచ్చిన ఆయన ఆస్తుల చిట్టా.. అతన్ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దేశంలో అత్యంత రిచెస్ట్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలుపుతోంది. సోమవారం నాడు తన నామినేషన్ దాఖలు చేసిన పెమ్మసాని.. నిబంధనల ప్రకారం ఆస్తులతో పాటు అప్పుల గురించి కూడా ప్రస్తావించారు. ఆయన ఆస్తి విలువ అక్షరాల 5,705 కోట్ల రూపాయలు ఉండగా అప్పులు 1,038 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్రదేశాలలోనే కాక అమెరికాలో కూడా పెమ్మసాని పేరిట ఆస్తులు ఉన్నాయి. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి డాక్టర్ గా వైద్య వృత్తిలో అంచెలు అంచెలుగా ఎదిగిన వ్యక్తి పెమ్మసాని. ఇప్పటివరకు ఇరు తెలుగు రాష్ట్రాలలో ఏ అభ్యర్థి కూడా ఇంత పెద్ద మొత్తంలో స్థిర చరాస్తులను చూపించలేదు.