తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత తీవ్ర రూపు దాల్చింది. అది కాస్తా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధానికి తెరతీసింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఓ రకంగా చెప్పాలంటే చట్టవిరుద్ధమని చెప్పొచ్చు. అలాంటిది ప్రణీత్ రావుతో పాటు పలువురుపోలీస్ అధికారులు చట్టవిరుద్ధంగా నేతలు, అధికారులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని తేలడంతో విచారణ ముమ్మరమైంది. ఈ పరిస్థితుల్లో ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్.. పోలీసులు తమ విధిలో భాగంగా ఒకరో, ఇద్దరో నిందితుల ఫోన్లను ట్యాప్ చేసి ఉంటారని అనడం మరింత సీరియస్నెస్ పెంచింది. అంతేకాదు..రేవంత్రెడ్డి.. ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరు, అంటూ ఎవరినీ ఏమీ చేయలేవన్నారు కేటీఆర్.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా ఉంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నారు.. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారు. ట్యాపింగ్పై పక్కాగా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాధ్యులు చర్లపల్లి జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.అంతే కాదు.. కేటీఆర్ వ్యవహారశైలిపైనా తీవ్రవ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను బాధితుడినన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. తనతో పాటు కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు రఘునందన్. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం లేదన్నారు.
ఏతా, వాతా చూస్తుంటే.. ఈకేసులో గులాబీపార్టీ అగ్రనేతల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో ఇది కాస్తా పార్టీ పుట్టి ముంచుతుందన్న ఆందోళనలు గులాబీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాళేశ్వరం సహా వరుసగా గత సర్కార్ నిర్ణయాలపై విచారణలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశిస్తూ వస్తోంది. ఈ సమయంలో వెలుగుచూసిన ఈ ట్యాపింగ్ వివాదం .. బీఆర్ఎస్ ను మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది.మరి దీన్ని ఆపార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.