దేవసేనగా రానున్న రకుల్?
కొండపొలం తర్వాత టాలీవుడ నుంచి బాలీవుడ్ కు వెళ్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో రకాల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సౌత్ నుంచి తనకెందుకు పాన్ ఇండియా ఛాన్సులివ్వరని, తెలుగులో కొంత మందికే ఆ అవకాశాలిస్తారా అని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత రకుల్ మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది లేదు.
ఈ నేపథ్యంలో రకుల్ తన కంబ్యాక్ ను గ్రాండ్ గానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోయిన్ గా మాత్రమే నటించిన రకుల్, ఈసారి ఏకంగా సోలోగానే బాక్సాఫీస్ ను దున్నాడానికి స్కెచ్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకున్న పరిచయాలన్నింటిని వాడుకుని రకుల్ పుష్కర్ రామ్మోహన్ నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేయడానికి డిస్కషన్స్ చేస్తుందట.
అంతేకాదు, ఆ సినిమాకు దేవసేన అనే టైటిల్ కూడా పెట్టినట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. ఓ కొత్త కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. బలమైన కంటెంట్ తో నడవనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మించనున్నారట. బాహుబలిలో దేవసేన లాంటి పాత్రను చేయాలని చాలా మంది హీరోయిన్లు తహతహలాడారు. ఇప్పుడు ఆ టైటిల్ తో రకుల్ సినిమా చేస్తుండటం ఆసక్తికరం.