'సోషల్ మీడియా'తో అనర్థమే...
ఇవాళ, రేపు ఎక్కడ చూసినా సోషల్ మీడియా రాజ్యమే నడుస్తోంది. చిన్నా,పెద్దా, పడుచు, ముసలి తేడా లేదు. అందరి చేతిలోనూ సెల్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అయితే విజ్ఞాన సముపార్జనకు ప్రయత్నిస్తే తప్పులేదు. కానీ ఎంటర్ టైన్ మెంట్ కోసం జనం దీన్ని ఆశ్రయిస్తున్నారు . కొందరికి ఇది డబ్బు సంపాదకు ఓ మార్గంగా మారింది. అయితే ఎక్కువ మంది మాత్రం.. నిత్యం సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. ఫలితంగా మెంటల్ గా ఇన్ బ్యాలెన్స్ అవుతున్నారు. మానసిక వ్యాధులతో సతమతమవుతున్నారు.
సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాల గురించి చాలా ఏళ్లుగా మాట్లాడుకుంటున్నాం. వాటిని నిషేధించాలనే డిమాండ్లు కొన్నిచోట్ల వినిపిస్తున్నాయి. అయితే ఓ సిటీ... ముందే మేలుకుంది. ఏకంగా సోషల్ మీడియా ను ప్రజారోగ్యానికి ప్రమాదకారిగా అభివర్ణించింది. పొగాకు, తుపాకీల తరహాలోనే సామాజిక అనుసంధాన వేదికలు కూడా ప్రమాదకారి అని తేల్చి చెప్పింది. యూఎస్లోని పెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నగరంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా పర్యావరణ విష పదార్థం, ప్రజారోగ్యానికి ప్రమాదం అని ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ తేల్చిచెప్పారు.
పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రావడానికి టిక్టాక్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లే ముఖ్యకారణమని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో యువత అత్యధికంగా కుంగుబాటు బారిన పడుతోందని సర్వేలు చెబుతున్నాయని ఉదహరించారు. సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్న పిల్లలపై ఓ కన్నేయాలని తల్లిదండ్రులను కోరారు. న్యూయార్క్లోని 77 శాతం హైస్కూల్ విద్యార్థులు వారం రోజుల్లో రోజుకు మూడు గంటలు కంటే ఎక్కువ స్క్రీన్ ముందు గడిపారని 2021 సర్వేలో తేలింది. దీనికి హోంవర్క్ చేసే సమయం అదనం అని చెప్పారు.
సామాజిక మాధ్యమాలు పిల్లలను వ్యసనపరులుగా చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు, తుపాకీలను వైద్యుడు అనారోగ్య కారకాలుగా ఎలా భావిస్తారో... సామాజిక మాధ్యమాలను మేం అలానే హానికరం అనుకుంటున్నాం. వీటిని రూపొందిస్తున్న టెక్ కంపెనీలే దీనికి బాధ్యత వహించాలన్నారు మేయర్ ఎరిక్ ఆడమ్స్..