మండలివారికి న్యూ జెర్సీ సెనెట్ శాల్యూట్
తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన తెలుగు భాషోద్యమ నాయకులు శ్రీ మండలి బుద్ధప్రసాదుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రంలోని న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్ మరియు జెనరల్ అసెంబ్లీ సంయుక్తంగా తీర్మానిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి బుద్ధప్రసాద్ చేసిన సేవలకు గాను శాల్యూట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ తెలుగు భాషాపరిరక్షణకు అవిశ్రాంతంగా శ్రమించినందుకు ఈ గౌరవాన్ని అందిస్తున్నట్టు ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పశు సంవర్థక శాఖామాత్యులుగా ఉన్న కాలంలో రైతులకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమలో పనిచేసే మహిళల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని శ్లాఘించారు. పశుసంవర్ధక పరిశోధక కేంద్ర వ్యవస్థాపనను ఈ తీర్మానంలో ప్రస్తుతించారు.
సామాజిక ప్రగతికి ఆదర్శనీయమైన పాత్రను పోషించిన శ్రీ బుద్ధప్రసాద్ భవిష్యత్తులో తెలుగు ప్రజలకోసం మరింత సమున్నత కృషి చేయగలరని ఆశిస్తూ న్యూ జెర్సీ సెనేట్ అధ్యక్షులు నికోలస్ పి స్కుటారి, అసెంబ్లీ స్పీకర్ గైగ్ జె కఫ్లిన్ సంతకం చేసిన తీర్మాన ధృవపత్రంపై సెనేట్ కార్యదర్శి అసెంబ్లీ అధికారులు అధికార ముద్రవేశారు.
నిన్న గుంటూరు విశ్వనగర్‘లో జరిగిన ఒక కార్యక్రమంలో న్యూజెర్సీ అసెంబ్లీ పూర్వపు డెప్యూటీ స్పీకర్ శ్రీ చివుకుల ఉపేంద్ర ఈ తీర్మాన ధృవపత్రాన్ని తీసుకువచ్చి శ్రీ విశ్వయోగి విశ్వంజీ చేతులమీదుగా శ్రీ బుద్ధప్రసాదుకు బహూకరించారు.
శ్రీ బుద్ధప్రసాదుకు దక్కిన ఈ అరుదైన గౌరవం తెలుగు భాషోద్యమానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, జి వి పూర్ణచందు అభినందనలు తెలిపారు.