పెండింగ్ లో ఎన్డీఏ కూటమి సీట్లు..
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ ,25 పార్లమెంటు స్థానాలున్నాయి.ఇందులో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఎన్డీఏ కూటమి మాత్రం పొత్తుల చిక్కులను విప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. నిన్నటి వరకూ ఆలస్యం చేసిన బీజేపీ ఏకబిగిన ఏపీలోని ఆరు ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఎచ్చెర్ల, అనపర్తి, విజయవాడ-వెస్ట్, బద్వేల్, ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఇంకా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది.
మరోవైపు టీడీపీ సైతం ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆజాబితాలో దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంత అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు ఉన్నాయి. చంద్రబాబు తుదివరకూ సర్వేలు, అభిప్రాయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నారు. దీంతో ఎవరి పేరు ఏ స్థానంలో వస్తుందో తెలియక అభ్యర్థులు సైతం ఇబ్బంది పడుతున్నారు. అలా అని ఆశ వదులుకోలేక.. తమకు టికెట్ కావాలంటూ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నివాసం చుట్టూ ప్రదక్షిణలు సైతం చేస్తున్నారు.
జనసేన సైతం మొత్తం తాము పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు గానూ.. 18 అసెంబ్లీ, ఓపార్లమెంటు స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇక మచిలీపట్నం పార్లమెంటు స్థానం పెండింగ్ లో ఉంది. అయితే ఈ స్థానానికి బాలశౌరి పోటీ చేస్తారని అంచనాలున్నప్పటికీ.. అసెంబ్లీకి పంపే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలు క్లారిటీ రాలేదు.. తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనలకు టీడీపీ వదిలి పెట్టింది. దీంతో బీజేపీ -10, టీడీపీ -7, జనసేన – 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో పెండింగ్ ఉన్నాయి.