రఘురామ కృష్ణంరాజు అటూఇటూ కాకుండా పోయారా..?
ఆంధ్రప్రదేశ్ లో రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా నర్సాపురం నుంచి బరిలోకి దిగి సత్తా చాటాలనుకున్నారు. అయితే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో రగిలిపోతున్నారు. మరోవైపు టీడీపీ కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేని సిచ్యుయేషన్ రావడంతో ఆయన అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది.
రఘురామ కృష్ణంరాజు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. నర్సాపురం పార్లమెంటు బరిలో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలల్లోనే రఘురామ కృష్ణంరాజు జగన్ కు దూరమయ్యారు. జగన్ పై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. అయితే రఘురామ కృష్ణంరాజు బీజేపీకి సన్నిహితంగా మెలగడంతో ఆయన్ను ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే తన పరిధిలో ఆయనపై పలు రకాల కేసులు పెట్టి అరెస్టు చేయగలిగింది. కానీ ఆయన బెయిల్ పై బయటకు రాగలిగారు. కానీ నియోజకవర్గానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.
వైసీపీకి దూరంగా ఉంటూ బీజేపీకి సన్నిహితంగా ఉండడంతో ఆయన ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగడం ఖాయమనుకున్నారు. అయితే ఆయన బీజేపీలో మాత్రం చేరలేదు. ఇప్పుడు బీజేపీ లిస్టు చూశాక రఘురామ కృష్ణంరాజు తీవ్ర నిరాశ చెందారు. తనకు టికెట్ రాకుండా బీజేపీలోని కొందరు జగన్ మనుషులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపురంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనకు టికెట్ రాకపోవడంతో షాక్ తిన్నారు. ఆయన తన పార్టీ వ్యక్తి కాదని బీజేపీ ఇప్పుడు సింపుల్ గా చేతులు దులిపేసుకుంది.
మరోవైపు టీడీపీ నుంచి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. నర్సాపురం పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లింది. విజయనగరం స్థానం ఖాళీగా ఉన్నా సామాజిక సమీకరణాల దృష్ట్యా అక్కడ రఘురామ కృష్ణంరాజును అడ్జస్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ నుంచి బయటికి వచ్చాక ఆయన బీజేపీలోనో, టీడీపీలోనో చేరి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏ పార్టీలో చేరకుండా అన్నీ తనవే అన్నట్టు వ్యవహరించారు. అదే ఇప్పుడు మొదటికే మోసం వచ్చేలా చేసింది. ఏ పార్టీ కూడా తనని ఓన్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరి చూడాలి ఆయన ఏం చేస్తారో..!