బోనాలు తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తాయి : మంత్రి తలసాని
ఆషాడ బోనాలు తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 24వ తేదీన జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు బోనాల పండుగను జరుపుకోలేదన్నారు. ఈ ఏడాది బోనాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 25వ తేదీన నిర్వహించే అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉత్సవం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ ఖర్చు గతంలో ఆలయ కమిటీ సభ్యులే భరించే వారని తెలిపారు.
దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద భక్తులు ఎలాంటి తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో భక్తుల కోసం 2 లక్షల వాటర్ ప్యాకెట్సను అందుబాటులో ఉంచుతామన్నారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.