పరవు నష్టం కేసులో రాహుల్ కు ఉపశమనం!
మహారాష్ట్ర లో నమోదైన ఓ పరువునష్టం కేసు లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి ఉపశమనం లభించింది. విచారణ క్రమంలో ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్ ఈ మేరకు దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్, శాశ్వత మినహాయింపునకు రాహుల్ అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని తెలిపారు. మహాత్మ గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్కు ముడిపెడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, ఇది ఆర్ఎస్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ, 2014లో ఓ సంఫ్ు కార్యకర్త భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ కేసు విచారణ క్రమంలో 2018లో జూన్లో రాహుల్ గాంధీ కోర్టుకు సైతం హాజరయ్యారు. అయితే, తాను ఢిల్లీవాసినని, పార్టీ కార్యక్రమాలకు తోడు ఎంపీగా తన నియోజకవర్గం (వయనాడ్)లో పర్యటనలు చేయాల్సి ఉంటుందని చెబుతూ, కోర్టులో హాజరు నుంచి రాహుల్ గతేడాది మినహాయింపు కోరారు. బదులుగా తన న్యాయవాదిని అనుమతించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడి (రాహుల్)కి కోర్టులో హజరు నుంచి మినహాయింపు ఉంటుందని అని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ తేదీల్లో రాహుల్ న్యాయవాది క్రమం తప్పకుండా, సరైన సమయానికి కోర్టు ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించినప్పుడు నిందితుడూ రావాలని షరతులు విధించింది.