గోల్డ్మన్ శాక్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అమెరికాకు చెందిన ప్రసిద్ధ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మన్ శాక్స్ కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచస్థాయి సంస్థలకు హైదరాబాద్ కేంద్రస్థానంగా మారిందని, 100కి పైగా దేశాలకు చెందిన సంస్థల పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు ఇక్కడ సాగుతున్నాయని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, సానుకూల పర్యావరణ వ్యవస్థల వల్ల హైదరాబాద్ అన్ని దేశాలను ఆకర్షిస్తోందని తెలిపారు. 2021లో హైదరాబాద్లో అడుగుపెట్టిన గోల్డ్మన్ శాక్స్ సుస్థిర సేవల కోసం అత్యాధునిక వసతులతో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయం. బహుళజాతి సంస్థలు ప్రతిభను గుర్తించి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. డిజిటల్ అక్షరాస్యత, మహిళా వ్యవస్థాపకత తదితర సేవా కార్యకలాపాల ద్వారా తెలంగాణ అభివృద్ధికి గోల్డ్మన్ శాక్స్ నిబద్ధతతో పనిచేస్తోంది. దానికి కృతజ్ఞతలు అని అన్నారు.
గోల్డ్మన్ శాక్స్ సంస్థ సీఈవో రిచర్డ్ గ్నోడ్ మాట్లాడుతూ న్యూయార్క్లో ప్రధాన కార్యాలయం తర్వాత ఇదే పెద్దది. పారిశ్రామిక, ఇంజినీరింగ్ భాగస్వామ్యాలకు, సేవలకు నిలయంగా మారుతుంది. కృత్రిమమేధ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి నవీన సాంకేతికతలతో సేవలందిస్తుంది. ప్రపంచ స్థాయి భారతీయ ప్రతిభకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది అని తెలిపారు.