పవన్ నోటి దురుసు తగ్గించుకోవాలి.. మండిపడుతున్న కృష్ణ అభిమానులు..
టాలీవుడ్ లో నేటితరం హీరోల కంటే కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోలకు ఇప్పటికీ కూడా అభిమానులు దండిగా ఉన్నారు. ఆ విషయం మర్చిపోయిన పవన్ అనవసరంగా దివంగత టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ల మధ్య ఉన్న వివాదం గురించి మాట్లాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ప్రచారంలో భాగంగా కృష్ణ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో.. అవి తమ అభిమాన హీరో ను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పవన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హయాంలో జరిగిన రాజకీయ విషయం గురించి.. ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినా పవన్ తెలిసి తెలియకుండా మాట్లాడాడు.
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ కాంగ్రెస్లో ఉండేవారని.. ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కృష్ణ సినిమాలను ఎన్టీఆర్ ఎప్పుడూ అడ్డుకోలేదని పవన్ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోకుండా ఎన్టీఆర్, కృష్ణ పై ప్రతి విమర్శలు చేయలేదని.. అది ఎన్టీఆర్ గొప్పతనానికి సూచన అని పవన్ అన్నారు. అంటే ఎన్టీఆర్ గొప్పలు చెప్పే క్రమంలో పవన్.. కృష్ణను తక్కువ చేసినట్లుగా అతని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చాలా సీరియస్ టాపిక్ గా మార్చి పవన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు నోటి దురుసు తగ్గించుకోమని అతనికి హితవు కూడా చెబుతున్నారు. మరోపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులను హర్ట్ చేయడం వల్ల కూటమికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ కొద్ది రోజులైనా పవన్ మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని సూచిస్తున్నారు.