సెమీస్లో బోల్తా పడిన సౌతాఫ్రికా.. ఫైనల్కు దూసుకెళ్లిన ఆసీస్
సెమీస్ వరకూ దూసుకొచ్చిన సౌతాఫ్రికా.. ఫైనల్కు ముందు బోల్తా పడింది. అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నిర్ణయం బెడిసికొట్టింది. ఆ టీంలో డేవిడ్ మిల్లర్ (101), హెన్రిక్ క్లాసెన్ (47) మినహా ఇంకెవరూ కనీసం పోరాటం చూపించలేకపోయారు. బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలం అవడంతో సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఆసీస్కు ట్రావిస్ హెడ్ (62), డేవిడ్ వార్నర్ (29) మంచి ఆరంభం అందించారు. మిచెల్ మార్ష్ (0) విఫలమైనా.. స్టీవ్ స్మిత్ (30), జోష్ ఇంగ్లిస్ (28) కీలక ఇన్నింగ్సులు ఆడారు. చివర్లో మిచెల్ స్టార్క్ (16 నాటౌట్), ప్యాట్ కమిన్స్ (14 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. దీంతో 47.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసిన ఆసీస్.. ఛేజ్ పూర్తి చేసింది. ఈ విజయంతో ఫైనల్లో అడుగు పెట్టిన ఆసీస్.. ఆదివారం జరిగే మ్యాచ్లో భారత్ను ఢీకొంటుంది. అటు బంతితో రెండు వికెట్లు తీసి, బ్యాటుతో కీలకమైన హాఫ్ సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.