ఆతీశీ చెప్పినట్లుగానే.. ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్కు ఈడీ సమన్లు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో ఆమ్ ఆద్మీ పార్టీ నేతకు ఈడీ నోటీసులు అందాయి. లోక్సభ ఎన్నికలకు ముందు తనతో పాటు మరో ముగ్గురు నేతలు అరెస్టు అవుతారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ ఈ మధ్యనే పేర్కొన్న విషయం తెలిసిందే. తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఈడీ లిస్ట్లో ఉన్నారని గత మంగళవారం ఆమె పేర్కొన్నారు. కాగా.. ఆతీశీ చెప్పినట్లుగానే తాజాగా దుర్గేష్ పాఠక్కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది.
తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ను ఈడీ విచారించింది. కొన్ని డాక్యుమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆయనను విచారించిట్లు ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ద్వారా దుర్గేష్కు సమన్లు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు చెల్లింపులకు సంబంధించిన పలు ప్రకటనల్లో దుర్గేష్ పేరు ఉండటంతో 2022లోనూ ఆయనను ఈడీ విచారణకు పిలిచింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆప్ కీలక నేతలు అరెస్టవగా.. తాజాగా దుర్గేష్ పాఠక్కు సైతం సమన్లు జారీ కావడంతో ఆప్ నేతల్లో ఆందోళన మొదలైంది.
సౌత్ గ్రూప్ నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను గోవా ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఈ లిక్కర్ స్కాం కేసులోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను గత నెల అరెస్ట్ చేసి విచారించింది. విచారణలో కేజ్రీవాల్ కీలక విషయాలను వెల్లడించారని, నిందితుడైన విజయ్ నాయర్.. తన మంత్రి వర్గంలోని ఆతిశీ, సౌరభ్కు రిపోర్టు చేసేవాడని సీఎం పేర్కొన్నట్లు ఏఎస్జీ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈడీ తమ విచారణలో వేగం పెంచింది.