సిద్ధరామయ్యకు కాంగ్రెస్ షాక్
వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీకి అథానీ స్థానం నుంచి టికెట్ లభించింది. సవాడీ ఆశించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ సీటు కేటాయించింది. అయితే కోలార్ సీటు ఆశిస్తున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు మాత్రం భంగపాటు ఎదురైంది. ఆ స్థానాన్ని అధిష్ఠానం కొత్తూర్ జి మంజునాథ్కు కేటాయించింది. సిద్దరామయ్యని ఆయన కుమారుడు ప్రాతినిధ్యం వహించిన వరుణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి జాబితాలో ఆయనకు వరుణ సీటు కేటాయిస్తూ ఖరారు చేసింది. అయితే, రెండో నియోజకవర్గం కింద కోలార్ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని ఆయన భావించారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ఒక అభ్యర్థికి ఒకే స్థానం నిబంధనను పాటిస్తున్న కాంగ్రెస్, మాజీ సీఎం విషయంలోనూ దాన్నే అనుసరించింది. ఈ నేపథ్యంలోనే కోలార్ స్థానాన్ని కొత్తూరు మంజునాథ్కు కేటాయించింది.