రేవంత్ నెక్స్ట్ టార్గెట్ జగన్..?
కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్ ఫిక్స్ చేసింది.. కర్నాటక, తెలంగాణ గెలుపు తర్వాత ఏపీపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన రాజకీయ చదరంగం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.సీఎంగా నెలరోజులు పాలన పూర్తిచేసుకున్న రేవంత్... తన తొలి అస్త్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఎక్కుపెట్టారు. అది కూడా.. ఆయన చెల్లెలు షర్మిలతో భేటీ అయిన కొద్దిసేపటి తరువాతే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ తెలుగు న్యూస్ ఛానల్ చర్చలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయంగా ఏపీ సీఎం జగన్ పనైపోయిందంటూ సంచలన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.. ఏపీలో కాంగ్రెస్ గెలుపుకోసం తామంతా కృషి చేస్తామన్నారు. రాజకీయంగా తాను షర్మిలకు అండగా ఉంటానన్నారు. అంతేకాదు.. తాను ఇచ్చిన పార్టీకి హాజరైన ఎంపీలకు జగన్ టికెట్ ఇవ్వకుంటే... వారు కావాలనుకుంటే కాంగ్రెస్ ఇస్తుందన్నారు. షర్మిలమ్మకు చెప్పి తాను టికెట్ ఇప్పిస్తానన్నారు రేవంత్. టీడీపీకి, వైసీపీకి ఎన్ని బీఫామ్ లు ఉన్నాయో.. తమ పార్టీకి అన్నే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాదు.. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి జగన్ చాలా చేశారన్నారు రేవంత్.
నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని జగన్ కోరుకుంటున్నారని, తాను మాత్రం రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే పట్టుదలతో ఉన్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని జగన్ ఆకాంక్షించారని, తాను మాత్రం కేసీఆర్ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని చెప్పారు. అంతేకాదు.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. తనను అభినందిస్తూ వైఎస్ జగన్ .. ఓ ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు.
రేవంత్ స్టేట్ మెంట్ ఇప్పుడు వైసీపీకి గట్టిగానే తగులుతోంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ ... ఈఎన్నికల్లో వైసీపీని ఢీకొడుతుందన్న సంకేతాలొస్తున్నాయి. వైఎస్ కుటుంబంలో ఇద్దరు నేతలు ఎన్నికల్లో తలపడితే.. ఓటుబ్యాంకు చీలుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఇదే అంశాన్ని ఓసభలో ఇండైరెక్టుగా సీఎం జగన్ సైతం ప్రస్తావించారు. రాజకీయ పొత్తుల కోసం కుటుంబాన్ని చీల్చే ఎత్తులుంటాయన్నారు. ఏదేమైనా ఈపరిణామాలు మాత్రం వైసీపీకి శరాఘాతంలా మారాయని చెప్పవచ్చు.