ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు భేటీ..
పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో బీ ఫారాలు అందించారు. మొదట శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి వరుసగా జిల్లాల వారీగా ప్రతి అభ్యర్థికి బీ ఫారాలు చంద్రబాబు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీ ఫారాలు అందుకున్న ప్రతి అభ్యర్థి వచ్చే ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన అన్నారు. అంతేకాదు అభ్యర్థుల ఎంపిక ప్రజల, కార్యకర్తల అభీష్ట మేరకు జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు కూటమిగా కదులుతున్న మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఎన్నికలకు కేవలం 22 రోజుల సమయం ఉందని చెప్పిన చంద్రబాబు.. ప్రచారం నిర్వహించే ఈ 20 రోజులు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. ఈ 20 రోజుల సమయం కార్యకర్తలు, నాయకులు కలిసిమెలిసి పార్టీని గెలిపించే విధంగా ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు.