కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం... 13 ప్రాంతీయ భాషల్లోనూ
సాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే ఉద్యోగార్థులకు శుభవార్త. ప్రస్తుతం ఉన్న హిందీ, ఇంగ్లిష్తో పాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష నిర్వహణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సీఏపీఎఫ్ల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకుగానూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చొరవతో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. హోంశాఖ తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఇప్పటికే ఉన్న హిందీ, ఇంగ్లిష్తో తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష, ప్రాంతీయ భాషలో పరీక్ష రాసేందుకు వీలుంటుందని, తద్వారా వారి ఎంపిక అవకాశాలూ మెరుగుపడతాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది.