సందేశ్ఖాలీ ఘటనపై 100% బాధ్యత ప్రభుత్వానిదే: మమతకు చురకలంటించిన హైకోర్టు
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ వ్యవహారంపై మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా మందలించింది. సందేశ్ఖాలీలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల కేసుపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం.. రాష్ట్రంలో పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లిందంటే ఆ బాధ్యత 100 శాతం అధికార పార్టీదేనని సూటిగా చెప్పింది. అలాగే సందేశ్ఖాలీలో జరిగిన ఘటన ఒక్కశాతం నిజమైనా అది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొంది. సందేశ్ఖాలీ ఘటనపై దాఖలైన 5 పిటిషన్లు (ప్రజాప్రయోజన వ్యాజ్యాల)పై చీఫ్ జస్టిస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్యతో కూడిన కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి.. షాజహాన్ తరపు లాయర్పై కఠిన ప్రశ్నలు సంధించారు. ‘మీరు ఓ నిందితుడి తరపున వాదిస్తున్నారు. ముందు మిమ్మల్ని కమ్ముకున్న నీడలను వదిలించుకోండి. ఆ తర్వాత మిగిలిన వారి గురించి మాట్లాడండి’’ అంటూ చురకలంటించారు.
రెండు నెలల క్రితం, పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాస్ జిల్లా పరిథిలోని సందేశ్ఖాలీ ప్రాంతానికి చెందిన అనేకమంది మహిళలు అప్పటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్పై కోర్టుకెక్కారు. తన అనుచరులతో కలిసి షాజహాన్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తమకు న్యాయం చేయాలని న్యాయస్థానం తలుపు తట్టారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. సందేశ్ఖాలీ ప్రాంతం అట్టుడికిపోయింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత షాజహాన్ షేక్ అరెస్టు కావడం, అతడిని టీఎంసీ కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిపోయాయి.