ఎన్నికల రణరంగంలోకి గులాబీ దళపతి.. కేసీఆర్ బస్సుయాత్ర..
సార్వత్రిక ఎన్నికల్లో కారు దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. దీనిలో భాగంగా ఇప్పటికే పొలంబాట కార్యక్రమం చేపట్టిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా 12 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బస్సుయాత్రను ప్రారంభించారు. నల్లగొండ జిల్లా మిర్యాల గూడ నుంచి ప్రారంభమైన ఈ బస్సుయాత్ర.. సిద్ధిపేటలో బహిరంగసభతో ముగియనుంది. మొత్తంగా 17రోజుల యాత్రను చేపట్టారు కేసీఆర్.
మిర్యాలగూడ నుండి పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖం పూరించారు గులాబీ బాస్. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. ఉదయం పూట రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలు సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలకు ఏర్పాట్లు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టనున్నారు కేసీఆర్.
ఈ బస్సు యాత్ర ద్వారా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై ప్రధానంగా ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. దీంతోపాటు ఈ సీజన్లో భారీగా పంటలు ఎండిపోవడం.. కరెంట్ సరఫరా లేక మోటర్లు కాలిపోవడం, వరి మద్దతు ధరకు రూ. 500 బోనస్ అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచకపోవడం, మహిళలకు రూ. 2,500 హామీని అమలు చేయకపోవడం సహా కాంగ్రెస్ సర్కార్ హామీలు నెరవేర్చడంతో విఫలమైన అంశాలపై కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు.
ఇటీవలే ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూలో బీఆర్ఎస్కు 12 స్థానాలు వస్తాయన్నారు కేసీఆర్. అయితే ఆమాటను సొంతపార్టీలోని వారే నమ్మడం లేదన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఓటమిపై ఇప్పటివరకూ పోస్టుమార్టం చేయకపోవడం సైతం కేడర్లో చర్చనీయాంశమైంది. ఓవైపు సీనియర్లు కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు ఉన్న నేతలు సైతం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.