ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడతారా? : మమత బెనర్జీ
లోక్సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై టీఎంసీ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. బాంకుడాలో నిర్వహించిన ప్రచార సభలో దీదీ మాట్లాడారు. జూన్ 4వ తేదీ తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని మోదీ చెప్పడమంటే, ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతారనే అర్థమని చెప్పారు. ఇదే మోదీ గ్యారంటీ అని మండిపడ్డారు. స్థానిక పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు తూర్పు మేదినీపుర్ జిల్లాలోని భూపతినగర్కు వెళ్లినట్లు ఆరోపించారు.
ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్కు వస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి సమస్య లేదు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత అవినీతి విషయంలో ప్రతిపక్షాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్న దీరు ఆమోదయోగ్యం కాదు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడతారా? ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో పెడతానని నేను చెబితే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు. కాబట్టి, ఆ మాట అనడం లేదు. జూన్ 4 తర్వాత ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడమే మోదీ గ్యారంటీ అని అన్నారు.