6న శతకపద్య సామూహిక గానం ప్రారంభించనున్న జే తాళ్ళూరి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), శతశతక కవి చిగురుమళ్ల శ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో జనవరి 6న ''అమ్మ, నాన్న గురువు శతక పద్యార్చన'' కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జే తాళ్లూరి తెలిపారు. పిల్లలకు కనీస అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు కల్పించడానికి అందరూ ప్రయత్నిస్తుంటారని, కాని పిల్లలకు కనీస విలువలను నేర్పించి, వారిని నైతికంగా తీర్చిదిద్దేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని అన్నారు. ప్రత్యక్ష దేవతగా పిలిచే అమ్మ నేడు నిరాదరణకు గురవుతోందని, ఇక నాన్న విలన్గా మారిపోతున్నారని, నేటి పిల్లలు తమ తల్లితండ్రుల మాటను వినకపోవడం జరుగుతోందని, దీనికి ముఖ్య కారణం వారిలో కనీస నైతిక విలువలను పెంపొందించేవారు లేకపోవడమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో తానా, కవి శ్రీనివాస్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
న్యూయార్క్ లో ఈనెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ శతక పద్యార్చనను వివిధ ప్రాంతాల్లోని లక్షలాది మంది విద్యార్ధులు.. ఎవరి పాఠశాలలో వారు సామూహిక గానం చేస్తారన్నారు. పుస్తకాల్లోని పద్యాలను విద్యార్థులతో కంఠస్తం చేయించి వారిలో స్ఫూర్తిని రగిలించేందుకు ఈ అక్షర యజ్ఞం చేపట్టామని జే తాళ్ళూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.