పోలీస్ శాఖకు ‘కొత్త’ జోష్!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానుక
పోలీస్ శాఖకు ‘కొత్త’ జోష్!
పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు
నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ
నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో పోలీస్ శాఖకు ‘కొత్త’ జోష్ వచ్చింది. వివిధ స్టేషన్లకు అందించేందుకు పోలీస్ శాఖకు కొత్త వాహనాలొచ్చాయి. విజయవాడలో సోమవారం జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా వాహనాలు పంపిణీ చేయనున్నారు. అలాగే ఏళ్ల తరబడి పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఏడాదిలో ఆ ముచ్చటా తీరనుంది. పదోన్నతి అందుకున్న వారు జనవరి 1 నుంచి కొత్త హోదాలో విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని వాహనాల్లేని పోలీస్ స్టేషన్లకు జీపులు, బైకులు, అధునాతన కార్లు అదించనున్నారు. రెండు నెలల క్రితం జరిగిన కలెక్టర్లు, జిల్లా ఎస్పీల సదస్సులో డీజీపీ ఆర్పీ ఠాకూర్ పోలీస్ స్టేషన్లకు వాహనాలు లేవన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు రూ. 50 కోట్లు విడుదల చేయించారు.
కొత్త ఏడాది.. కొత్త హోదా..
రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోని కానిస్టేబుళ్లను ఎంపిక చేసి అర్హత పరీక్ష నిర్వహించిన పోలీసు శాఖ కొత్త సంవత్సరంలో 2019 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పటికే హెడ్కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ భుజంపై సింగిల్ స్టార్ కోసం ఎదురుచూస్తున్న 566 మందికి ఏఎస్ఐ హోదా ఇచ్చేసింది. వీరితోపాటు పలువురు ఐస్ఐలకు సీఐలుగా, సూపర్ న్యూమరీలకు రెగ్యులర్ డీఎస్పీలుగా, రెండేళ్లు ఆలస్యమైనా 45 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. కాగా.. పదోన్నతులతోపాటు కొత్త వాహనాలు కూడా అందిస్తున్న సీఎం చంద్రబాబుకు పోలీసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం జరిగే కార్యక్రమంలో సీఎంను ఘనంగా సత్కరిస్తామని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది.