జనసేన సభ్యత్వం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్లోని పార్టీ పరిపాలన కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పార్టీలో తొలి సభ్యత్వాన్ని ఆయనే స్వీకరించారు. అనంతరం పార్టీలోని ముఖ్యులకు సభ్యత నమోదు పత్రాలను ఆయన అందించారు. సభ్యత్వ నమోదుకు రూపొందించిన సాఫ్ట్వేర్పై సంతృప్తి వ్యక్తం చేశారు. పదేళ్లుగా తనను అనుసరిస్తున్న ప్రముఖులతో గత మూడు రోజుల నుంచి విడతల వారీగా పవన్ ఇష్టాగోష్టి నిర్వహించారు. రాబోయే రోజుల్లో నిర్వహించే శిక్షణ శిబిరాల గురించి వారితో చర్చించారు. పార్టీకి స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, అనలిస్టులు, సమన్వయకర్తలుగా పని చేయడానికి ముందుకు వచ్చిన వారిలో తొలుత మహిళలు, సీనియర్ సిటిజన్స్కు ఒక వర్కుషాపు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త సంవత్సరం తొలి రోజుల్లోనే ఈ వర్కుషాపులను నిర్వహించాలని బావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే పార్టీ ప్రతినిధులు ప్రకటిస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు.