తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, దేశ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 ఏడాది ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని, ప్రతి ఒక్కరికి విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇదే ఒరవడిని మున్ముందు కొనసాగిస్తాం. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ప్రపంచంలో తెలుగుజాతి ఔన్నత్యం కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది. ప్రజలందరూ 2017 ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృస్టిలో ఉంచుకుని నూతన ఏడాదిలో మరింత పట్టుదల, కృషితో సవాళ్లను అధిగమించి విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి గెలుపునందించే సంవత్సరం కావాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.