ఘనంగా టిఫాస్ సంక్రాంతి సంబరాలు
తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఎడిసన్లోని జాన్ ఆడమ్స్ మిడిల్ స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు, పోటీలకు మంచి స్పందన వచ్చాయి. జానపద నృత్యాలు, బుర్రకథ, యక్షగానం, మల్లఖంబ్, హాస్యయోగ వంటి కార్యక్రమాలు అందరినీ మైమరపింపజేశాయి. ఎడ్యుకేషనల్ వర్క్షాప్తోపాటు, వివిధ పోటీలను నిర్వహించారు. గాలిపటాల పోటీలు, ముగ్గులు, ఫ్యాన్సీ డ్రెస్, పోస్టర్స్, కాలేజ్, తెలుగు పిండివంటలు, తెలుగు క్విజ్, తెలుగు మాట్లాట, తెలుగు పద్యపఠనం విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసారు.
టిఫాస్ అధ్యక్షుడు మధు రాచకుళ్ళ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటిన్ కమిటీ సభ్యులు, రవి అన్నదానం, శ్రీనివాస్ చెరువు, సుధ దేవులపల్లి, జ్యోతికామరసు, వెంకట ఎస్పి మూర్తి టాటా, నాగ మహేందర్ వెలిశాల, అనిల్ కుమార్ వీరిసెట్టి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ సందర్భంగా మధు రాచకుళ్ళ మాట్లాడుతూ, టిఫాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. వచ్చినవారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలకు సహకరించి విజయవంతం చేసిన దాతలకు, వలంటీర్లకు టిఫాస్ ఎగ్జిక్యూటివ్ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.