ఇళ్ళకు డిమాండ్
దేశంలో సొంతింటి కల డిమాండ్తో సెకండ్ గ్రేడ్ టౌన్స్, మెట్రో సిటీల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇళ్ల కొనుగోళ్లలో గతేడాది టాప్ సెవెన్ నగరాల్లో 31 శాతం వృద్ధి నమోదైందంటే.. నగరాల్లో ఇళ్లకున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. దేశంలో పట్టణ జనాభా అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో నగరాలు విస్తరిస్తున్నాయి. అంతే కాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులు, విద్యాసంస్థలు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోజురోజుకు పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అతివేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏడాది కాలంగా దేశంలోని టాప్ సెవెన్ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే 2023లో దేశవ్యాప్తంగా 31 శాతం ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. పూణె, ముంబాయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీలో ఇళ్ల అమ్మకాలు భారీగా జరిగినట్లు సర్వేల్లో తేలింది.
2022లో 3 లక్షల 64 వేల 870 ఇళ్ల అమ్మకాలు జరగగా.. 2023లో 4 లక్షల 76 వేల 530కి అమ్మకాలు పెరిగాయి. ఇందులో అత్యధికంగా 52 శాతంతో పూణె నంబర్వన్ స్థానంలో ఉంది. 40 శాతంతో రెండోస్థానంలో ముంబయి, 34 శాతంతో మూడోస్థానంలో చెన్నై, 30 శాతంతో నాలుగో స్థానంలో హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. తర్వాత వరుసగా బెంగళూరు, కోల్కతా, ఢల్లీి నగరాలున్నాయి.