రూటు మార్చిన త్రినాథరావు
ధమాకా సినిమా హిట్టయినా సరే ఆ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని రీసెంట్ గానే కొత్త సినిమాను మొదలుపెట్టాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథను అందించాడు. ఒకప్పుడు ఇదే కథను ప్రసన్నకుమార్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పి ఒప్పించాడు. కాకపోతే ఆ సినిమా అప్పుడు పట్టాలెక్కలేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ లీక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సందీప్ కిషన్ తండ్రిగా నటిస్తున్న రావు రమేష్ పాత్ర ఈ సినిమాలో చాలా ఫన్నీగా ఉంటుందట. వయసొచ్చిన కొడుకున్నా సరే రొమాంటిక్ టచ్ పెట్టి ఆయనకో లవర్ ను సెట్ చేస్తున్నట్లు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం ప్రియమణి, మధుబాలను అనుకున్నారు కానీ కథ వినగానే అలనాటి హీరోయిన్ అన్షు సానుకూలంగా స్పందించిందట.
దీన్ని బట్టి ఇప్పటివరకు మామా అల్లుళ్ల డ్రామాలతో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసిన త్రినాథరావు-ప్రసన్న జంట ఈసారి తమ రూట్ ను మార్చినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. కొత్త టాలెంట్ ను వెతుకుతున్నట్లు టాక్. ఈ సినిమా హిట్ అవడం అటు హీరో, డైరెక్టర్ తో పాటూ రచయితకు కూడా ఎంతో అవసరం.