గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి... ఎదురు కాలేదు
సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటీ పర్వంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురకాలేదని రైతులే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సాగునీరు లేదు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. రాష్ట్రమంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం పట్టడం లేదు. ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదు రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారు. అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. రజాకార్లను తలపించేలా వాళ్లు ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన రేవంత్, అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు.