మార్చి 8 నుంచి 10 వరకు క్రెడాయ్ ప్రాపర్టీ షో
క్రెడాయ్ హైదరాబాద్ పదమూడో ఎడిషన్ ప్రాపర్టీ షోను మార్చి 8 నుంచి 10వ తేదీల్లో మాదాపూర్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ వెల్లడించింది. ఈ మూడు రోజుల ప్రాపర్టీ షోలో.. సుమారు అరవై మంది డెవలపర్లు పాల్గొంటారు. వందకుపైగా ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. ఇందులో అపార్టుమెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య స్థలాలు వంటి వివరాల్ని సమాచారాన్ని సందర్శకులకు అందజేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, స్థిరాస్తి ధరలు పెరుగుతున్నప్పటికీ నగరం గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉందని తెలిపారు. క్రితం సంవత్సరంతో పోల్చితే 2023లో ప్రాపర్టీ లావాదేవీలలో 25 శాతం వృద్ధి నమోదయిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో నగరంలో వృద్ధి జోరు కొనసాగుతుందని, ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా తాజా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించిందని చెప్పారు.
మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే క్రమంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ కారిడార్ అభివృద్ధి, టౌన్షిప్ల నిర్మాణం వంటి చోదకశక్తి ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 3.5`3.8 కోట్ల చ.అ.లలో హై క్వాలిటీ బిజినెస్ పార్కులు రానున్నాయని, దీంతో వచ్చే రెండేళ్లలో స్థిరాస్తి రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, కోకాపేట్, పుప్పాలగూడ, నార్సింగి, తెల్లాపూర్, కొంపల్లి, శామీర్పేట్ వంటి ప్రాంతాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు.