ఇవన్నీ అక్రమ కేసులే – జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇది ఏ మాత్రం న్యాయం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, మంచి పాలన అందించడంలో చంద్రబాబు దృష్టిపెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైయస్ జగన్ పరామర్శించారు. ’ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస చర్యలు జరుగుతున్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు అన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటువైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు అని వైయస్ జగన్ అన్నారు.